Anna Hazare : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 21 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఉద్దేశపూర్వక కుట్ర ఏదీ లేదని తీర్పు చెప్పింది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ని తప్పుబట్టింది. దీన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్వాగతించారు. న్యాయ వ్యవస్థే అత్యున్నతమైనదని, కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని హజారే పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తున్నదని, దేశంలో న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని చెప్పారు. న్యాయవ్యవస్థ కారణంగనే పలు రాజకీయ పార్టీలు, అనేక కులాలు, మతాలతో కూడిన ఈ దేశం సవ్యంగా నడుస్తోందని అన్నారు. బలమైన న్యాయవ్యవస్థ లేనప్పుడు నేరస్థులు పైచేయి సాధిస్తారని, దేశంలో అల్లర్ల లాంటి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
గతంలో తాను కేజ్రీవాల్పై చేసిన విమర్శలు అప్పట్లో ఉన్న ఆరోపణల ఆధారంగా చేసినవేనని, ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినందున దానిని అంగీకరిస్తున్నానని అన్నా హజారే చెప్పారు. అంతేకాదు 2011 నాటి ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో వీరంతా కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కేజ్రీవాల్, సిసోడియాలు తన వాళ్లేనని హజారే అభివర్ణించడం విశేషం. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టయినప్పుడు ఆయనపై అన్నా హజారే విమర్శలు చేశారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని వమ్ము చేశారని వ్యాఖ్యానించారు.