చెన్నై, ఫిబ్రవరి 4: తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ మధ్య దూరం పెరుగుతున్నది. బీజేపీ మార్క్ రాజకీయాలు అన్నాడీఎంకేకు బోధపడినట్టు కనిపిస్తున్నది. తాజాగా అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి పొన్నియన్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాల ప్రభుత్వాలను కూడా బీజేపీ పడగొట్టడం చూశామని, అలాంటి పార్టీతో తాముజాగ్రత్తగా ఉన్నామని అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదని, గీత దాటొద్దంటూ మరో నేత రామచంద్రన్ బీజేపీకి హితవుపలికారు. ఈరోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు తెరపైకి వచ్చాయి. అన్నాడీఎంకేలో మాజీ సీఎంలు పళనిస్వామి(ఈపీఎస్), పన్నీర్సెల్వం(ఓపీఎస్) వర్గాల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో భేటీ కావడం, ఉప ఎన్నికల్లో రెండు వర్గాలు కలిసి పనిచేయాలని సందేశంఇవ్వడంతో పళనిస్వామి వర్గం నేత పొన్నియన్ స్పందించారు.
మోదీ ఫొటో తొలగింపు..
ఈరోడ్ తూర్పు ఉపఎన్నికల్లో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఇదే సమయంలో బైపోల్స్లో తాము కూడా పోటీచేయాలని బీజేపీ మొదట భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీపై అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ క్యాంపెయిన్ పోస్టర్లలో ప్రధాని మోదీ, బీజేపీ నేతల ఫొటోలను ముద్రించలేదు. ఈ పరిణామాలతో కంగుతున్న బీజేపీ.. తాము ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించింది. అన్నాడీఎంకే నుంచి ఒకే అభ్యర్థి ఉండాలని, రెండు వర్గాలు కలిసి పనిచేయాలని, లేదంటే అధికార డీఎంకేకు కలిసొచ్చే అవకాశం ఉన్నదని అన్నామలై పేర్కొన్నారు.
‘రెండాకుల’పై అస్పష్టత
అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండాకులు’ కోసం ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు పోటీపడుతున్నాయి. పళనిస్వామి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘం రికార్డుల్లో అన్నాడీఎంకే అధ్యక్షుడిగా పన్నీరుసెల్వం ఉండటంతో పాటు, అన్నాడీఎంకే వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఎవరికి వస్తుందనే దానిపై అస్పష్టత నెలకొన్నది.
మీ పని చూసుకోండి..
బీజేపీపై అన్నాడీఎంకే మరో సీనియర్ నేత, ఐటీ వింగ్ కార్యదర్శి సింగై రామచంద్రన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వారి పార్టీ వ్యవహారాలు చూసుకోవాలని, ఇతర పార్టీల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చురకలు అంటించారు. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. గీత దాటొద్దని హెచ్చరించారు. బీజేపీ నేత ఈపీఎస్, ఓపీఎస్లను వేర్వేరుగా కలిసిన తర్వాత రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీని ఎలా నడుపుకోవాలో ఇతరుల నుంచి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు.