న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో రిసార్టు ఓనర్ చేతిలో హత్యకు గురైన 19 ఏండ్ల రిసెప్షనిస్ట్ భౌతిక కాయానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నది. అంకితా భండారీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
అంకితా భండారీ హత్యకు నిరసనగా జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఇవాళ మార్కెట్లను బంద్ చేశారు. అంకితకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 18న అంకితా భండారీ హత్యకు గురైంది. ఓ రిసార్టులో రిసెప్షనిస్ట్గా పనిచేసే ఆమెను రిసార్టు ఓనరే హత్య చేశాడు. ప్రత్యేక సేవల కింద గెస్టులతో వ్యభిచారం చేసేందుకు నిరాకరించిందన్న కసితో ఆమె ఉసురు తీశాడు.
రిసార్టు ఓనర్ ఉత్తరాఖండ్లోని సీనియర్ బీజేపీ నాయకుడు వినోద్ ఆర్యకు కుమారుడు పుల్కిత్ ఆర్య. ఘటన నేపథ్యంలో బీజేపీ వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగించింది. పుల్కిత్ సోదరుడు అంకిత్ ఆర్యను కూడా పార్టీ నుంచి తీసివేసింది. ఈ కేసులో పోలీసులు పుల్కిత్ ఆర్యను, అతనికి సహకరించిన రిసార్టు మేనేజర్ను, అసిస్టెంట్ మేనేజర్ను అదుపులోకి తీసుకున్నారు.