న్యూఢిల్లీ: ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి (20) అనే యువతి కారు ప్రమాదంలో మరణించి 60 గంటలు దాటింది. అయినా ఈ దుర్ఘటనపై ఎన్నో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే అంజలి డిసెంబర్ 31న రాత్రి ఫ్రెండ్స్తో న్యూఇయర్ సెలెబ్రేషన్స్కు వెళ్లింది. జనవరి 1న తెల్లవారుజామున 1.45 గంటలకు నిధి అనే స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి బయలుదేరింది.
వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్పురి ఏరియాకు రాగానే మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దాంతో నిధి ఎగిరి పక్కన పడగా.. అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయినా కారును ఆపకుండా కారులో ఉన్న అయిదుగురు నిందితులు పరారయ్యారు. ఆఖరికి 12 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అంజలి మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పోయారు.
ఈ అమానవీయ ఘటనపై ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ సమాధానాలు మాత్రం కొన్ని ప్రశ్నలకే ఉన్నాయి. కొత్త సంవత్సర వేడుకల వేళ.. ఒక కారు 12 కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని ఈడ్చుకెళ్తుంటే దారిలో పోలీసులకు కనిపించలేదా..? వేడుకల వేళ 12 కిలోమీటర్ల పరిధిలో ఒక్క పోలీస్ కూడా లేడా..? పోలీసులు ఉంటే మహిళను ఢీకొట్టిన నిందితులు ఎలా తప్పించుకోగలిగారు..? అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా ఉన్నాయి.
ప్రమాదం జరిగినప్పుడు అంజలితోపాటు స్కూటీపైనే ఉన్న నిధి స్నేహితురాలిని ఆ పరిస్థితుల్లో వదిలి ఇంటికి ఎలా వెళ్లగలిగింది..? కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఆలోచన కూడా నిధి ఎందుకు చేయలేదు..? కారులో ఉన్న ఐదుగురితోపాటు మరికొందరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. మరి ఆ నిందితులు ఎవరు..? కేసుతో వాళ్లకు ఏం సంబంధం ఉన్నది..? బైక్పై ఇద్దరు ఉన్న సంగతి తెలుసుకోవడానికి పోలీసులకు రెండు రోజులు ఎందుకు పట్టింది..? వీటికి కూడా ఎక్కడా సరైన సమాధానం లేదు.
అయితే, నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుటుంబానికి చెందినవాడని ప్రచారం జరుగుతున్నది. అతడిని తప్పించడం కోసం పోలీసులతో కలిసి సదరు బీజేపీ నేత తిమ్మినిబమ్మిని చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నది.