న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: భారత త్రివిధ దళాల నూతన అధిపతి(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ను కేంద్రం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు.. అనిల్ చౌహాన్ను ఎంపిక చేసినట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గత ఏడాది మేలో ఈస్టర్న్ కమాండర్గా పదవీ విరమణ చేసిన లెఫ్ట్నెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (61).. 40 ఏండ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1961 మే 18న జన్మించిన ఆయన.. 1980లో ఆర్మీలో చేరారు.
జమ్ముకశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటులను నిరోధించటంలో కీలకంగా పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఖడక్వాస్లా), ఇండియన్ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్)లో శిక్షణ పొందారు. పరమ్ విశిష్ట్ సేవా మెడల్, ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ సహా పలు పురస్కారాలు అందుకొన్నారు. సీడీఎస్గా నియమితులైన రెండో వ్యక్తి ఈయనే. 2020 జనవరి 1న దేశ తొలి సీడీఎస్గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అయితే గత ఏడాది డిసెంబర్ 8న తమిళనాడులో కోయంబత్తూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.