న్యూఢిల్లీ, మార్చి 7: పదోన్నతులు కల్పించటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీసీఎస్) అధికారులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలియచేశారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్ బయట మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 2500 మంది అధికారులు పాల్గొన్నారని సీసీఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఉదిత్ ఆర్య తెలిపారు. తమ డిమాండ్ నెరవేరకపోతే మార్చి 11న సుమారు 5వేల మందితో నిర్మాణ్ భవన్ ఆవరణలో మరోసారి నిరసనకు దిగుతామని వెల్లడించారు.
వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో పెరుగుతున్న మానవ వనరుల డిమాండ్ను అంచనా వేయటానికి కేంద్ర ప్రభుత్వం 2022లో ఉన్నత స్థాయి క్యాడర్ రివ్యూ కమిటీ (సీఆర్సీ)ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు సీఆర్సీ నివేదిక సమర్పించలేదని ఆర్య తెలిపారు. సీఆర్సీ వెంటనే నివేదిక సమర్పించాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఉదిత్ ఆర్య పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకుంటారని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మేల్కొనకపోతే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని, చివరకు సహాయ నిరాకరణ వరకు వెళతామని ఆర్య హెచ్చరించారు.