Bihar : బీహార్లో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రెండు రోజులుగా దాదాపు 60 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. జీతాలు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని వాళ్లు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. దాంతో, దాదాపు 60 వేల అంగన్వాడీలు మూతపడ్డాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు అసెంబ్లీ ముందు ధర్నాకు దిగారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనను ఉధృతం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 18వేలు, సహాయకులకు నెలకు రూ.9 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలకు రూ.5 వేల పెన్షన్, విధుల్లో ఉండగా చనిపోయిన వ్యక్తుల కుటుంబసభ్యులకు రూ. 5 లక్షలు చెల్లించాలని వాళ్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీల అధ్యక్షురాలు సుమిత్రా మొహపాత్ర స్పష్టం చేశారు.
‘మా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వందకు పైగా ఉత్తరాలు రాశాం. వాటికి ప్రభుత్వం స్పందించక పోగా మాపై మరింత పనిభారాన్ని మోపింది. దాంతో, ప్రభుత్వానికి 15 రోజుల నోటీసు ఇచ్చి, ధర్నాకు దిగాం’ అని అఖిల భారతీయ అంగన్వాడీ మహాసంఘం సెక్రెటరీ అంజలి పటేల్ చెప్పింది. ప్రస్తుతం బీహార్లో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 7,500 మాత్రమే చెల్లిస్తున్నారు.