కోల్కతా: పశ్చిమబెంగాల్కు చెందిన ఓ జంట వివాహం చేసుకుని దాదాపు మూడు దశాబ్దాలైన సంతానం కలుగలేదు. మహిళలోని గర్భాశయ సమస్యల కారణంగా పిల్లలు పుట్టలేదు. సమస్య పరిష్కారం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దాంతో వైద్యుల సలహా మేరకు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని రెండేళ్ల క్రితం ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భర్త కరోనా సోకి మరణించాడు. దాంతో 48 ఏళ్ల వయసులో భార్య అతడి వీర్యంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం భిర్భూమ్ జిల్లాలోని మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్ ప్రసాద్లకు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండటంతో సంతానం కలుగలేదు. సహజ గర్భధారణ కోసం రెండేళ్ల క్రితం వరకు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన దంపతులు.. ఫలితం లేకపోవడంతో ఐవీఎఫ్ విధానంలో పిల్లల్ని కనాలని నిశ్చయించుకున్నారు.
ఆ మేరకు రెండేళ్ల క్రితం అరుణ్ప్రసాద్ వీర్యాన్ని కోల్కతాలోని ఓ ల్యాబ్లో భద్రపరిచారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అరుణ్ ప్రసాద్కు కరోనా సోకి మరణించాడు. భర్త మరణంతో సంగీత కుంగిపోయింది. అత్తింటివారూ పట్టించుకోలేదు. అరుణ్ నడిపిన కిరాణం దుకాణమే ఆమెకు జీవనాధారమైంది. భర్త లేడన్న బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సంగీత.. భద్రపరచిన అతడి వీర్యం సాయంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది.
వైద్యులను సంప్రదించగా భద్రపర్చిన అరుణ్ ప్రసాద్ వీర్యాన్ని 48 ఏళ్ల వయసున్న సంగీత అండంలోకి ప్రవేశపెట్టారు. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 12న రాంపుర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.