కూటి కోసం కోటి కష్టాలు అన్నట్టు.. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు మంచినీళ్ల కోసం ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శించి.. జీవనోపాధి పొందుతున్నారు. ఏ మాత్రం ఆ ప్రయత్నం బెడిసికొట్టినా.. వారి ప్రాణాలకే ముప్పు. కానీ కడుపు నింపుకునేందుకు కష్టమైన పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మరి వారి ప్రదర్శనలను చూస్తే మన శరీరంపై రొమాలు నిక్కపొడవాల్సిందే.
ఒడిశాలోని ముండపోత కేల తెగ ఇప్పటి వరకు ప్రభుత్వం చేత గుర్తించబడలేదు. కొవిడ్ కంటే ముందు వారి జీవనం బాగానే ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల అనంతరం వారి జీవన చిత్రం ఛిద్రమైంది. దీంతో మళ్లీ తమకు వచ్చిన విద్యకు పదును పెడుతున్నారు. కనీస అవసరాలు తీరాలన్న, కడుపు నిండాలన్న తమకున్న నైపుణ్యంతో ఆ విద్యను ప్రదర్శించక తప్పడం లేదు.
ఈ ముండపోత కేల కమ్యూనిటీకి చెందిన వారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన వారని వినికిడి. బతుకుదెరువు కోసం కొన్ని దశాబ్దాల క్రితం ఒడిశాకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ తెగకు చెందిన ఒక గ్రామంలో స్థిరపడకుండా సంచార జీవనం చేస్తుంటారు. అలా గ్రామాలను తిరుగుతూ జీవనోపాధి పొందుతున్నారు.
ఇక ముండపోత కేల తెగలకు చెందిన వారి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కడుపు నింపుకుంటున్నారు. గ్రామ సరిహద్దుల్లో లేదా గ్రామాల్లో ఏటవాలుగా మట్టిని తవ్వి, అందులో వారి తలను పెడుతారు. ఆ తర్వాత తలను మట్టితో కప్పి ఉంచుతారు. కొన్ని నిమిషాల పాటు వారు అలాగే ఉండిపోతారు. తమ శ్వాసపైనే దృష్టి పెట్టి అలా ఉండిపోతారు. వారి ధైర్యసాహసాలు, ప్రదర్శనకు మెచ్చి.. గ్రామస్తులు కొంత ఆర్థిక సాయం చేస్తూ, బియ్యం, కూరగాయలు ఇస్తుంటారు. దాంతో వారు కడుపు నింపుకొని జీవనం సాగించడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఈ విద్యను ప్రదర్శించడం లేదు. ఏదో ఒక ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ విద్య ప్రదర్శించడం తమ ప్రాణాలకే హానీ.. కానీ బతుకుదెరువు కోసం చేయక తప్పట్లేదు అని మురళీ షికారీ అనే వ్యక్తి పేర్కొన్నాడు. మట్టిలో గుంత తవ్వి అందులో తల పెడుతాం. తమ తలపై మట్టి కప్పి ఉంచుతారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కళ్లు, చెవులు, నోరు, ముక్కులోకి మట్టి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. శ్వాసను కేంద్రీకరించడంతోనే ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు మురళీ షికారీ.