న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ మరోసారి తన విమానంలో ఒక నగరానికి వెళ్లాల్సిన ప్రయాణికుడిని మరో నగరానికి తీసుకెళ్లింది. బీహార్ రాజధాని పట్నాకు వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికుడు రాజస్థాన్లోని ఉదయ్పూర్ సిటీ ఎయిర్పోర్టులో దిగాడు. అక్కడ దిగిన తర్వాతగానీ అతనికి జరిగిన పొరపాటు అర్థం కాలేదు. జనవరి 30న ఈ ఘటన చోటుచేసుకోగా, తర్వాత రోజున ప్రయాణికుడిని పట్నాకు చేర్చారు.
అయితే, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణకు ఆదేశించింది. డీజీసీఏ సీనియర్ అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. అఫ్సర్ హుస్సేన్ అనే వ్యక్తి ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో పట్నాకు వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేశాడు. అయితే, అతను పట్నాకు వెళ్లే 6E – 214 ఫ్లైట్కు బదులుగా రాజస్థాన్కు వెళ్లే మరో ఇండిగో ఫ్లైట్ 6E – 319 ఎక్కాడు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్ దిగిన తర్వాత పొరపాటును గ్రహించిన ప్రయాణికుడు.. ఎయిర్పోర్టు అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లాడు. దాంతో అదేరోజు అతడిని ఢిల్లీకి చేరవేసి, మరుసటి రోజున పట్నాకు పంపించారు. ప్రయాణికుడికి జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. కానీ డీజీసీఏ మాత్రం ఇండిగో తీరుపై సీరియస్గా ఉన్నది.
ప్రయాణికుడు టికెట్ కొనుగోలు చేసిన తర్వాత రెండు చోట్ల ఫ్లైట్ టికెట్ను, బోర్డింగ్ పాస్ను తనిఖీ చేస్తారని, ఆ రెండు చోట్ల కూడా ప్రయాణికుడు ఎక్కాల్సిన విమానం అది కాదు అని ఇండిగో సిబ్బంది ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇండిగో ఎయిర్లైన్స్ జనవరి 13న కూడా ఇలాంటి పొరపాటే చేసింది. ఇండోర్ వెళ్లాల్సిన ప్రయాణికుడిని, నాగ్పూర్కు తీసుకెళ్లింది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఇండిగో ఎయిర్లైన్స్పై చర్యలకు డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతున్నది.