న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నగరంలో దారుణం జరిగింది. తనపై కుక్క మొరిగిందని భారత్కు చెందిన ఓ వ్యక్తి ఆ కుక్క యజమానురాలిని దారుణంగా హత్యచేశాడు. 2018లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి ఇక్కడి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి ఐదు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
దర్యాప్తు అనంతరం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2018లో రజ్విందర్ సింగ్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి క్వీన్స్లాండ్లో ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు రజ్విందర్ తన భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై అలిగి వంటింట్లోంచి కొన్ని పండ్లు, వాటిని కోసుకునేందుకు కత్తిని తీసుకుని సమీపంలోని వాంగెట్టి బీచ్కు వెళ్లాడు.
ఆ సమయంలో క్వీన్స్లాండ్కు చెందిన తోయా కార్డింగ్లే అనే యువతి తనను కుక్కను తీసుకుని అదే బీచ్కు వాకింగ్కు వచ్చింది. ఈ సందర్భంగా కుక్క రజ్విందర్పైకి మొరిగింది. ఇది రజ్విందర్, తోయాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. మాటామాటా పెరగడంతో తన దగ్గరున్న కత్తితో రజ్విందర్ తోయాపై దాడిచేశాడు. ఈ దాడిలో తోయా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
దాంతో రజ్విందర్ ఆమెను అక్కడే ఇసుకలో పాతిపెట్టి, ఆమె కుక్కను చెట్టుకు కట్టేశాడు. అనంతరం భార్యను, ముగ్గురు పిల్లలను ఆస్ట్రేలియాలోనే వదిలిపెట్టి భారత్కు వచ్చాడు. ఈ ఘటనపై సుదీర్ఘ కాలం దర్యాప్తు జరిపిన ఆస్ట్రేలియా పోలీసులు ఎట్టకేలకు రజ్విందర్ను నిందితుడిగా గుర్తించారు. ఇంటర్పోల్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు ఇవాళ నిందితుడిని అరెస్ట్ చేశారు.