Karnataka Elections | బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న కన్నడనాట తాజాగా అమూల్ పాల ప్రవేశం రాజకీయ పార్టీల మధ్య వివాదాన్ని రాజేస్తున్నది. ఆరునూరైనా గుజరాత్కు చెందిన అమూల్ పాలు, పెరుగు ఇక్కడకు రాకుండా అడ్డుకుని తీరుతామని విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్రకటిస్తుండగా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ అంశా న్ని వివాదం చేస్తున్నాయంటూ అధికార బీజేపీ చెప్తున్నది. అమూల్ పాల ప్రవేశాన్ని నిరసిస్తూ కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో కార్యకర్తలు గుజరాత్కు చెందిన డెయిరీ కో-ఆపరేటివ్ సంస్థ ముందు ధర్నా చేశారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని పాలను దెబ్బతీయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
దానికి బలం చేకూర్చేలా కర్ణాటకలో అమూల్ పాలు, పెరుగును ఆన్లైన్ వేదికల ద్వారా అమ్ముతామని గుజురాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఇటీవల ప్రకటించింది. మాజీ సీఎం సిద్ధరామయ్య దీనిపై మాట్లాడుతూ ‘ఇప్పటికే మా విజయా బ్యాంక్ను గుజరాత్కు చెందిన బరోడా బ్యాంక్ కలిపేసుకుంది. ఇప్పుడు మా కర్ణాటక నందిని పాలను కబళించడానికి అమూల్ ప్రయత్నిస్తున్నది. గుజరాతీయులకు మేమేమైనా శత్రువులమా మోదీ? అని ప్రశ్నించారు.
బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ వేసవి కారణంగా నందిని పాల ఉత్పత్తి తగ్గిందని చెప్పారు. రోజుకు 90 లక్షల లీటర్లు ఉత్పత్తి కావాల్సి ఉండగా, ప్రస్తుతం 75 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నామని, రాష్ట్రంలో పాల కొరత ఏర్పడిందని చెప్పారు. దీనిని కర్ణాటక స్టేట్ హోటల్స్ అసోసియేషన్ నేత నాగరాజు ఖండిస్తూ.. అమూల్ పాల ఉత్పత్తులను రాష్ట్రంలోకి తేవడానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు.