న్యూఢిల్లీ, అక్టోబర్ 15: అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు మళ్లీ పెరిగాయి. అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అమూల్ గోల్డ్, బర్రె పాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచినట్టు శనివారం ప్రకటించింది. ఫ్యాట్ (కొవ్వు) ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ మినహా అన్ని ప్రాంతాల్లో పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోథీ వెల్లడించారు. మరోవైపు మదర్ డెయిరీ సైతం తమ పాల ధరను పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఫుల్క్రీమ్ పాలతోపాటు ఆవుపాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం లీటర్కు రూ.61గా ఉన్న ఫుల్క్రీమ్ పాల ధర ఇకపై రూ.63కు, ఆవుపాల ధర రూ.53 నుంచి రూ.55కు పెరుగుతుంది. అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. ఇంతకుముందు ఈ రెండు సంస్థలు లీటర్ పాల ధరను మార్చిలో రూ.2, ఆగస్టులో మరో రూ.2 చొప్పున పెంచాయి.