న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): పాల ధరలు మరింత భారం కానున్నాయి. పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ నిర్ణయం తీసుకున్నాయి. గోల్డ్, తాజా, శక్తి బ్రాండ్ల పాల ధరను లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరుతో డెయిరీ ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ప్రకటించింది. పాల ఉత్పత్తి ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నామని, ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. రూ.2 పెంపుతో ఎమ్మార్పీ 4% శాతం పెరుగుతుంది. పెరిగిన ధరలు అమూల్ మార్కెటింగ్ చేసే ప్రతి చోటా వర్తిస్తాయని వివరించింది. అహ్మదాబాద్, సౌరాష్ట్ర మార్కెట్లలో అర లీటర్ అమూల్ గోల్డ్ పాలను రూ.31కి, అమూల్ తాజా పాలను రూ.25కి, అమూల్ శక్తి పాలను రూ.28కి అమ్మనున్నట్టు తెలిపింది.
మదర్ డెయిరీ సైతం
మదర్ డెయిరీ కూడా పాల ధర పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నామని, బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. లీటర్ ఫుల్ క్రీమ్ పాలను రూ.61కి, టోన్డ్ పాలను రూ.51కి, డబుల్ టోన్డ్ పాలను రూ.45కి, ఆవు పాలను రూ.53కి, బల్క్ వెండెడ్ (టోకెన్) పాలను రూ.48కి అమ్మనున్నట్టు వివరించింది.