న్యూఢిల్లీ: ఖలిస్థాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ అనే రాడికల్ ఆర్గనైజేషన్ నాయకుడు అమృత్పాల్ సింగ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. పంజాబ్ స్పెషల్ టీమ్ పోలీసులు.. సినీ ఫక్కీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అమృత్పాల్ తన అనుచరులతో కలిసి జలంధర్ జిల్లాలోని షాకోట్ తాలూకాకు వెళ్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో.. స్పెషల్ టీమ్ పోలీసులు అతడిని బుట్టలో వేసేందుకు పకడ్బీంధీగా వలపన్నారు.
ముందుగా షాకోట్లో అన్ని వైపులా రహదారులను బారీకేడ్లతో మూసివేశారు. అమృత్పాల్ మద్దతుదారులు ప్రతిసారి అతడిని పోలీసులకు చిక్కకుండా తప్పిస్తుండటంతో ఈసారి ఛాన్స్ ఇవ్వదల్చుకోలేదు. అందుకే వాళ్లు ఒకరికొకరు సమాచారం చేరవేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అనంతరం అమృత్పాల్ కాన్వాయ్ను చేజ్ చేయడం మొదలుపెట్టారు.
పోలీసుల వెంబడిస్తున్నారని పసిగట్టిన అమృత్పాల్, తన మద్దతుదారులతో కలిసి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా పక్కా ప్లాన్తో ఉన్న పోలీసులు అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. జిల్లాలు మారుతూ పారిపోతున్నా కొద్దీ స్పెషల్ పోలీసులు వాళ్ల కాన్వాయ్ని వెంబడించారు. కాన్వాయ్ ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానిక పోలీసులు స్పెషల్ టీమ్కు సహకరించారు.
అలా మొత్తం ఏడు జిల్లాల్లో అమృత్ పాల్ కాన్వాయ్ని చేజ్ చేశారు. ఈ చేజింగ్లో మొత్తం 100 పోలీస్ కార్లు పాల్గొన్నాయి. చివరికి నిందితుల కాన్వాయ్ షాకోట్ తాలూకాకు చేరుకుని రోడ్లన్నీ మూసివుండటంతో పోలీసులకు చిక్కింది. అమృత్పాల్ సింగ్ను స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అంతకుముందు చేజింగ్ సమయంలోనే ఆరుగురు అమృత్పాల్ అనుచరులు పోలీసులకు చిక్కారు.
అయితే, అమృత్పాల్ సింగ్, అతని ప్రధాన అనుచరగణం పోలీసులకు చిక్కినప్పటికీ పంజాబ్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేదు. అమృత్పాల్ మద్దతుదారులు ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందున రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్పై బ్యాన్ కొనసాగుతుందన్నారు.