చెన్నై: తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. అమ్మా వాషింగ్ మెషిన్లు, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు, సోలార్ కిచన్లు, ఇంటికే రేషన్ వంటి ఎన్నో హామీలు ప్రకటించింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం, ఇతర నేతల సమక్షంలో విడుదల చేసిన మ్యానిఫెస్టోను పార్టీ నేత పొన్నయ్యన్ చదివి వినిపించారు.
‘అమ్మ ఇల్లం తిట్టం’ పథకం కింద అందరికీ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ప్రయాణ రాయితీలు, ప్రతి ఇంటికి ఉచితంగా కేబుల్ టీవీ, 150 రోజులు ఉపాధి పనులు, కాలేజ్ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా, విద్యా రుణాల మాఫీ, పెట్రోల్ ధరల తగ్గింపునకు చర్యలు, ప్రసూతి సెలవులు ఏడాదికి పెంపు, దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లు రూ.2,000కు పెంపు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, సేంద్రీయ వ్యవసాయంతోపాటు, యుపీఎస్సీ, నీట్, ఐఐటి-జేఈఈ, టీఎన్పీఎస్పీ ఆశావాదులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ వంటివి ప్రకటించారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులోని ఏడుగురు దోషులను విడుదల చేస్తామని, శ్రీలంక శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని, సీఏఏను వెనక్కి తీసుకోవాలని అడుగుతామని అధికార పార్టీ హామీ ఇచ్చింది. శిథిలావస్థతకు చేరిన అన్ని మతాల ప్రార్థన మందిరాల పునరుద్ధరణ, హజ్, జరుసలం యాత్రలకు ఆర్థిక సహాయం పెంపు, ఇస్లాం యూనివర్సిటీ ఏర్పాటు, మదురై అంతర్జాతీయ విమానాశ్రయానికి స్థానిక తేవర్ కమ్యూనిటీకి చెందిన దివంగత రాజకీయ నాయకుడు ముత్తురామలింగం తేవర్ పేరు వంటి హామీలను మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.