పుణే : అధికారం కోసం హిందుత్వ విషయంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాజీ పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ పనితీరు పేలవంగా ఉందని మండిపడ్డారు. పుణేలో ఛత్రపతి శివాజీ విగ్రహ శంకుస్ధాపనతో పాటు బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఎంవీఏ సర్కార్ను భిన్నదారుల్లో వెళుతున్న మూడు చక్రాల బండిగా అభివర్ణించారు.
ఈ ప్రభుత్వం సాఫీగా సాగడం లేదని కేవలం కాలుష్యం వెదజల్లుతోందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేసి మెజారిటీ సాధించినా ఠాక్రే నేతృత్వంలోని పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిందని అన్నారు. ఈ క్రమంలో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్లతో కూడిన ఎంవీఏ ప్రభుత్వం మహారాష్ట్రలో కొలువుతీరగా బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైందని చెప్పారు.
2019లో బీజేపీ నుంచే సీఎం ఎన్నికవుతారని తాను చెప్పినా అధికార దాహంతో వారు హిందుత్వతో రాజీపడ్డారని అమిత్ షా పేర్కొన్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పలుమార్లు అవమానించిందని దుయ్యబట్టారు. బీజేపీ కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాతే అంబేద్కర్తో అనుబంధమున్న ఐదు ప్రాంతాలను స్మృతి స్ధలాలుగా మార్చామని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే వరకూ రాజ్యాంగ దినాన్ని ఘనంగా నిర్వహించలేదని అన్నారు.