Mallikarjun Kharge : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సెటైర్లు వేశారు. రాజ్యసభ వేదికగా ఆయన అమిత్ షాపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగం ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ నెల 13, 14 తేదీల్లో లోక్సభలో చర్చ పూర్తయ్యింది.
ఇవాళ, రేపు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఇవాళ ఈ చర్చలో పాల్గొన్న మల్లికార్జున్ ఖర్గే.. బీజేపీ తీరును, ఆ పార్టీ ముఖ్య నేతల తీరును తప్పుపట్టారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకులపై అవినీతి ముద్రవేసి, వాళ్లు బీజేపీలో చేరగానే నీతిమంతులుగా బీజేపీ చెబుతుండటాన్ని ఖర్గే హేళన చేశారు. బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారని ఎద్దేవా చేశారు.
‘అమిత్ షా ఒక పెద్ద వాషింగ్ మెషిన్ కొన్నాడు. ఆ వాషింగ్ మెషిన్లోకి ఎవరు వెళ్లినా పూర్తిగా పరిశుద్ధమై బయటికి వస్తారు’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. ‘మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు’ అని హితవు పలికారు. ప్రధాని మోదీ ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికే వెళ్తారు. కానీ మణిపూర్కు వెళ్లేందుకు మాత్రం అతను ఇష్టపడటం లేదు’ అని విమర్శించారు.
రాహుల్గాంధీ మణిపూర్కు వెళ్లారని, అంతేగాక అక్కడ యాత్ర చేశారని మల్లికార్జున్ ఖర్గే గుర్తుచేశారు. ప్రధానికి కావాల్సినంత భద్రత ఉంటుందని, అయినా ప్రధాని మాత్రం మణిపూర్కు వెళ్లేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నిరోజులవుతున్నా మణిపూర్లో పరిస్థితి మీరు ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రభుత్వాన్ని ఖర్గే ప్రశ్నించారు.