చెన్నై : ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసరాలు సహా అన్ని సేవలు, వస్తువుల ధరలు భారమవుతున్నాయి. రవాణా వ్యయాలు పెరిగి కూరగాయలు, కిరాణా వస్తువులు, పండ్లు సహా అన్నీ చుక్కలు చూస్తున్నాయి. పెట్రో ధరల సెగలతో క్యాబ్ల ధరలూ భారమయ్యాయి.
ఇంధన ధరల భారంతో చెన్నైలో ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లు చార్జీల ధరలను 14 శాతం వరకూ పెంచారు. డ్రైవర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కస్టమర్లపై చార్జీల భారం మోపకతప్పడం లేదని ఊబర్ సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ (ఇండియా, దక్షిణాసియా) నితీష్ భూషణ్ పేర్కొన్నారు.
పెట్రో ధరల పెరుగుదలతో ఇంధన వ్యయం, డ్రైవర్ల సంపాదన దృష్టిలో పెట్టుకుని చార్జీల ధరను 10 నుంచి 14 శాతం పెంచామని చెప్పారు. ఇంధన ధరల సవరణను పరిశీలించి ఆపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఊబర్ ఇండియా అంతకుముందు ముంబైలో 15 శాతం, ఢిల్లీలో 12 శాతం, చెన్నైలో 10 శాతం వరకూ క్యాబ్ చార్జీలను పెంచింది.