ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాసిక్లోని సర్కార్వాడా పోలీస్స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్ 25న దసరా ఉత్సవాల సభలో ప్రసంగించిన యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా బీజేపీ యావత్మాల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నితిన్ భుటాడా, రాజు పడ్గిల్వార్ ఫిర్యాదు చేశారు. యోగిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఉద్ధవ్ ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
ఉద్ధవ్ఠాక్రే చెంపదెబ్బ కొడతానన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణెపై పోలీసులు కేసు పెట్టినందుకు ప్రతిగా మహారాష్ట్ర సీఎంపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం గమనార్హం. నారాయణ రాణెకు వ్యతిరేకంగా పలు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మహాద్ కోర్టులో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాణెకు బెయిల్ మంజూరైంది.
నారాయణ్ రాణె వివాదం నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ను స్లిప్లర్లతో కొడతానని చేసిన వ్యాఖ్య పాత వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పాల్ఘార్ పర్యటన సందర్భంగా ఛత్రపతి శివాజీ ఫొటోకు పూల మాల వేస్తున్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన పాదరక్షలు విడువలేదు. ఆ పని చేసినందుకు యోగి పాదరక్షలతోనే ఆయనను కొడతాను అని ఠాక్రే అన్నారు. “ఆయన యోగి అయితే సీఎం ఎలా అయ్యారు? ఆయన అన్ని వదిలి గుహలో కూర్చోవాలిగా.. సీఎం పదవిలో కూర్చున్నాక యోగి అని పిలిపించుకోవడం ఎందుకు?” అని ఠాక్రే నిలదీశారు.