ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది అంతుపట్టడం లేదు. సీఎం ఏక్నాథ్ షిండేను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అర్ధరాత్రి వేళ కలిశారు. తెల్లవారుజాము 2 గంటల వరకు వారిద్దరూ మంతనాలు సాగించారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవర్ తన వర్గంతో కలిసి ప్రభుత్వంలో చేరడంపై చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారాన్ని పంచుకోవడం, మంత్రివర్గాన్ని విస్తరించడంపై షిండే, ఫడ్నవీస్ మాట్లాడుకున్నట్లు తెలిసింది.
కాగా, అజిత్ పవర్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై ఏక్నాథ్ షిండే వర్గం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో షిండే, ఫడ్నవీస్ అర్ధరాత్రి వేళ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అయితే తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని షిండే వర్గం తెలిపింది. అలాగే ఏక్నాథ్ షిండే సీఎం పదవి నుంచి తప్పుకోవడం లేదని ఆయన వర్గం పేర్కొంది.
మరోవైపు మహారాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ఆగస్ట్ 4 వరకు జరుగనున్నాయి. శుక్రవారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తోపాటు ఎన్సీపీకి చెందిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆ పార్టీ నేత ఛగన్ భుజబల్ కూడా బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, అజిత్ పవర్తో సహా 12 మంది తిరుగుబాటు నేతలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చర్యలు చేపట్టారు. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఈ సమావేశం, అందులో చేసిన తీర్మానాలకు చట్టబద్ధత లేదని అజిత్ పవార్ వర్గం పేర్కొంది.