Khalistani Terrorist | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఖలిస్థానీ అంశం, ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లాకు ఉగ్ర సంస్థ లష్కరే తాయిబా, పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పంజాబ్లో పలువురు హిందూ నేతలను లక్ష్యంగా దాడులకు కుట్రలు పన్నాడని, ఈ మేరకు ఇద్దరు ఉగ్రవాదులకు పని అప్పగించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇటీవల అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదుల కేసులో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలో బయటపడ్డాయని, అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడు తాను అర్ష్దీప్ దల్లాతో టచ్లో ఉన్నట్టు అంగీకరించాడని, పంజాబ్లో ఉగ్రదాడులు చేయాలని సూచించినట్టు విచారణలో పొలీసులు చార్జిషీట్లో పేర్కొన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. లష్కరే గ్రూపునకు చెందిన ఉగ్రవాది సుహైల్తో దల్లాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నిజ్జర్కు సన్నిహితుడిగా పేర్కొన్న అర్ష్దీప్ దల్లాపై భారత్లో దాదాపు 25 కేసులు ఉన్నాయి. అతను 2020లో కెనడాకు పారిపోయినట్టు నిఘా వర్గాల సమాచారం.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై తమకు నిఘా వర్గాల సమాచారం ఉన్నదని కెనడా చెబుతుండగా.. అదేమీ లేదని భారత వర్గాలు వాదిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆ సమాచారాన్ని అడుగ్గా, కెనడా నుంచి ఎటువంటి స్పందన లేదని ఓ అధికారి పేర్కొన్నారు. ఖలిస్థానీ గ్రూపులు చెప్పినట్టుగా కెనడా ప్రభుత్వం నడుచుకొంటున్నదని, అదే ఇతర దేశాలకు కూడా చెబుతున్నదని ఆరోపించారు. కెనడాలో గ్యాంగ్ వార్లు, ఇమ్మిగ్రేషన్ బిజినెస్ సాధారణం అని, ఆ దేశంలో పాక్ ఐఎస్ఐ, చైనా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా చాలా క్రియాశీలంగా ఉన్నాయని, బిజినెస్పై నియంత్రణ కోసం వారి టార్గెట్లను హత్య చేస్తారని పేర్కొన్నారు.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ సైన్యం తరపున పోరాడిన 98 ఏండ్ల యరోస్లావ్ హుంకా అనే వ్యక్తిని కెనడా పార్లమెంట్ సభ్యులు నిలబడి చప్పట్టు కొడుతూ గౌరవించడం పట్ల ప్రతిపక్ష పార్టీలతో పాటు అన్ని వర్గాలు మండిపడ్డాయి. తీవ్ర విమర్శల నేపథ్యంలో హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంటోనీ రోటా యూదులకు క్షమాపణలు చెప్పారు.
దేశాన్ని మత ప్రాతిపదికన ముక్కలు చేయాలనేది ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ప్లాన్ అని నిఘా వర్గాల తాజా నివేదిక పేర్కొన్నది. ఖలిస్థాన్, ఉర్దుస్థాన్ ఆయన ప్రతిపాదిన రాజ్యాల్లో ఉన్నాయని వెల్లడించింది. దీనికి తోడు కశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టేందుకు గురుపత్వంత్ కుట్రలు చేస్తున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. గురుపత్వంత్పై దేశంలోని పంజాబ్, ఢిల్లీ, యూపీ తదితర రాష్ర్టాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలతో సహా 16 కేసులు ఉన్నాయి.
2018 జనవరి, 2023 జూన్ మధ్య దాదాపు 1.6 లక్షల మంది భారత్ పౌరసత్వం వదులుకొని, కెనడా పౌరసత్వం తీసుకొన్నారని భారత విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ కాలవ్యవధిలో 114 దేశాల్లో ఆయా దేశాల జాతీయత కోసం భారత పౌరసత్వం వదులుకొన్న వారిలో(8.4లక్షలు) ఈ సంఖ్య 20 శాతంగా ఉన్నది. భారత్ నుంచి వలస వెళ్తున్న వారికి అమెరికా తర్వాతి గమ్యస్థానంగా కెనడా ఉన్నది. దాదాపు 58 శాతం మంది ఈ రెండు దేశాలనే ఎంచుకొంటున్నారు. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, యూకే ఉన్నాయి.