న్యూ ఢిల్లీ: ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రంగా ఉండటంతో ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
లఖ్నవూలోని కేజీఎమ్యూ, లోహియా, సివిల్ ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య 50 నుంచి 60 శాతం మేర పెరిగినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చాలా మంది ప్రజలు గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాయి. అయితే, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించాయి.
శీతల వాతావరణం కారణంగా ప్రజలు ఎక్కువగా శ్వాసకోశ సమస్యలతో బాధపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీని కారణంగా ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పారు.
‘ఆసుపత్రిలో శ్వాసకోశ రోగుల సంఖ్య 50-60 శాతం పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆసుపత్రులకు వస్తున్న రోగుల్లో ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఆయాసం, నీరసం వంటి లక్షణాలను ప్రధానంగా గుర్తించాం. ఇప్పటికే తీవ్రమైన వ్యాధితో పోరాడుతున్న రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడిపానీయాలు ఎక్కువగా తీసుకోవాలి’ అని సూచించారు.