డెహ్రాడూన్: ఇటీవల మహిళలు చిరిగిన జీన్స్ ధరించడంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్, మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భారత్ను అమెరికా 200 ఏండ్లు పాలించిందని అన్నారు. వాస్తవానికి స్వాతంత్రానికి ముందు భారత్ను బ్రిటన్ పాలించింది. అయితే తీరథ్ సింగ్ రావత్ మాత్రం భారత్ను అమెరికా పాలించిందని తెలిపారు. ‘మనల్ని 200 ఏండ్లు బానిసలుగా చేసి ప్రపంచాన్ని పాలించిన అమెరికా కరోనా నియంత్రణలో సతమతమవుతున్నది’ అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య రంగంలో తొలిస్థానంలో ఉన్న అమెరికాలో 50 లక్షలకుపైగా ప్రజలు కరోనాతో చనిపోయారని, ఆ దేశం మరోసారి లాక్డౌన్ దిశలో ఉన్నదని తెలిపారు.
మరోవైపు ఇతర దేశాలతో పోల్చితే కరోనాను భారత్ బాగా నియంత్రిస్తున్నదని తీరథ్ సింగ్ కొనియాడారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ‘మోదీ కాకుండా మరొకరు ప్రధానిగా ఉండి ఉండే భారత్లో కరోనా పరిస్థితి ఎలా ఉండేదో.. మనం దారుణ పరిస్థితిలో ఉండేవాళ్లం. కానీ ప్రధాని మనకు ఊరటనిచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
అంతేగాక ప్రధాని మోదీ ప్రతి ఒక్కరిని కరోనా నుంచి కాపాడారని రావత్ అన్నారు. ‘అయితే మనం ఆయన సూచనలు పాలించలేదు. మాస్క్లు ధరించడం, శానిటైజేషన్, చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటివి కొంత మంది ప్రజలే పాటించారు’ అని అన్నారు. కాగా, తీరథ్ సింగ్ రావత్ మాట్లాడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
#WATCH "…As opposed to other countries, India is doing better in terms of handling #COVID19 crisis. America, who enslaved us for 200 years and ruled the world, is struggling in current times," says Uttarakhand CM Tirath Singh Rawat pic.twitter.com/gHa9n33W2O
— ANI (@ANI) March 21, 2021