న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కెనడా, భారత్ మధ్య నెలకొన్న దౌత్య విభేదాలపై కెనడాను అమెరికా, బ్రిటన్ వెనకేసుకు వచ్చి ఆ దేశానికి మద్దతు పలికాయి. నిజ్జర్ హత్యపై దర్యాప్తు సాఫీగా సాగడానికి కెనడాకు భారత్ సహకరించాలని సూచించాయి. ఇటీవల భారత్ నుంచి పలువురు కెనడా దౌత్యవేత్తలను వెనక్కి పంపడంపై యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ఆందోళన వ్యక్తం చేయగా, ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించబోమంటూ బ్రిటన్ ఫారెన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎఫ్సీడీవో) స్పష్టం చేసింది. విభేదాలను ఇరుదేశాలు పరిష్కరించుకోవాలని సూచించాయి. కాగా, 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పంపేయాలంటూ భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం రెండు దేశాల మధ్య లక్షలాది మంది ప్రజల జీవితాలను కష్టతరం చేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.