తన వల్లే కాంగ్రెస్ ఓడిందన్న కాంగ్రెస్ నేతల వాదనలపై మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఈ జన్మలో పాఠాలు నేర్చుకోలేదని ఫైర్ అయ్యారు. కేవలం పంజాబ్లోనే కాకుండా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు పరాభవమే ఎదురైందని దెప్పి పొడిచారు. కాంగ్రెస్ ఈ జన్మలో పాఠాలు నేర్చుకోలేదు. యూపీలో పరాభవానికి కారకులెవ్వరు? మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లోని పరాభవానికి ఎవరు బాధ్యులు? దీనికి సమాధానం పెద్ద పెద్ద అక్షరాలతో రెడీగానే వుంటుంది. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ చదవదు. దాని సహజ లక్షణం అంటూ అమరీందర్ సింగ్ ఫైర్ అయ్యారు.
పంజాబ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓడిపోయారు. పాటియాలా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్… ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. చాలా కాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన అమరీందర్ సింగ్… ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కాంగ్రెస్ను వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీని తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా… చివరికి సొంత పార్టీ పెట్టుకొని.. పరాజయం మూటగట్టుకున్నారు.