న్యూఢిల్లీ : చండీఘఢ్లోని పంజాబ్ భవన్లో మంగళవారం జరగాల్సిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్మీట్కు తాము అనుమతి నిరాకరించామని ఆప్ చేసిన ఆరోపణలను పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తోసిపుచ్చారు. ఆప్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేజ్రీవాల్ కోరుకుంటే తాము ఆయనకు లంచ్ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. కొద్దిరోజుల కిందట ఇక్కడ కేజ్రీవాల్ ర్యాలీ కూడా నిర్వహించారని, అలాంటిది ఇప్పుడు ఆయన ప్రెస్మీట్ను తాము ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు.
ప్రెస్మీట్ను అడ్డుకుంటున్నామని ఆప్ చెబుతున్న మాటలు కట్టుకధలని కెప్టెన్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్ భవన్లో కేజ్రీవాల్ ప్రెస్మీట్కు పంజాబ్ సీఎంఓ అనుమతి నిరాకరించిందని అంతకుముందు ఆప్ ఆరోపించింది. అనుమతి లేకున్నా మంగళవారం మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ హామీల వర్షానికి తెరలేపింది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పధకాన్ని ప్రవేశపెడతామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.