న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణ మీనన్ మార్గ్లోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార నివాసానికి సాయంత్రం ఆయన వెళ్లారు. అయితే అమిత్ షాతో అమరీందర్ సింగ్ భేటీకి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఆయన బీజేపీలో చేరేందుకేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంజాబ్ కాంగ్రెస్లో సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి అమరీందర్ సింగ్ ఇటీవల రాజీనామా చేశారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన బీజేపీలో చేరవచ్చన్న టాక్ వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన అమరీందర్ ఆయనతో ఏకాంతంగా చర్చలు జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
అయితే తన ఢిల్లీ పర్యటన రాజకీయ నేతలను కలిసేందుకు కాదని అమరీందర్ సింగ్ మంగళవారం తెలిపారు. పంజాబ్ కొత్త సీఎం కోసం అధికార నివాసమైన కపుర్తలా హౌస్ను ఖాళీ చేసేందుకే ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. సీఎం పదవికి రాజీనామా తర్వాత కాంగ్రెస్ను వీడబోనని ఆయన అన్నారు.
కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. సిద్ధూను పీసీసీ చీఫ్గా చేయడంపై కినుక వహించిన అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కాగా, కొత్త సీఎం చరంజిత్ సింగ్ చన్నీ తనను సంప్రదించకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సిద్ధూ పీసీసీ పదవికి మంగళవారం రాజీనామా చేశారు.