చండీగఢ్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పంజాబ్ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతున్నది. బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ బీజేపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో షాతో భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. కేంద్ర కొత్త సాగు చట్టాలు, వాటి రద్దుకై 10 నెలలకు పైగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై షాతో చర్చించానని అమరిందర్ తెలిపారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేసి వెంటనే సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరానని చెప్పారు. ఈ విషయంలో ఒక బ్లూప్రింట్ తయారుచేయాలని ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, పీసీసీ అధ్యక్ష పదవికి మంగళవారం రాజీనామా చేసిన నవజ్యోత్సింగ్ సిద్ధూ మౌనం వీడారు. తాను ఏ త్యాగానికైనా సిద్ధమే కానీ నీతి నియమాల విషయంలో రాజీపడబోనని ట్విట్టర్లో వీడియో పోస్టు చేశారు. కళంకితులైన నేతలు, అధికారులకు ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ నిర్ణయాలపై మండిపడ్డారు. కొన్నినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో పంజాబ్ కాంగ్రెస్లో ముసలం అధిష్ఠానాన్ని కలవరపెడుతున్నది. అయితే సిద్ధూకు ఫోన్ చేశానని సీఎం చన్నీ తెలిపారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని కోరానని చెప్పారు. దీనికి సిద్ధూ అంగీకరించారన్నారు.
‘గ్రూప్ 23’ అంటే ‘జీ హుజూర్ 23’ కాదు: సిబల్
పంజాబ్లో సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేఖ రాశారు. దీనికి ముందు మరో సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా ఇదే డిమాండ్ చేశారు. పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడు లేనప్పటికీ ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ‘గ్రూప్ 23’ అంటే ‘జీ హుజూర్ 23’ కాదని వ్యాఖ్యానించారు.