ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా నదులు డ్రగ్స్తో కలుషితమవుతున్నాయి. ఔషధాలతో నదుల్లో పెరుగుతున్న కాలుష్యం భయానకంగా ఉన్నది. ఎందుకంటే.. ఈ కాలుష్యం కోట్లాది ప్రజల జీవితాలను పరోక్షంగా ప్రభావితం చేస్తున్నది. ‘జర్నల్ ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజీ అండ్ కెమికల్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆయా నదుల్లోని నీరు 43.5శాతం డ్రగ్స్తో కలుషితమయ్యాయి. యూకే యూనివర్సిటీ ఆఫ్ యార్క్.. అలెజాండ్రా బుజాస్-మన్రాయ్ నేతృత్వంలో పరిశోధకులు 104 దేశాల నుంచి 1,052 నమూనాలను విశ్లేషించారు. వీటిలో సురక్షితమైన వాటి కంటే ఎక్కువ స్థాయిలో 23 రకాల ఔషధాల కలయికలను గుర్తించారు.
భారతదేశం వంటి దిగువ మధ్య ఆదాయ దేశాల నదుల్లోనూ అత్యధిక మొత్తంలో మెడిసిన్స్ ఆనవాళ్లను గుర్తించారు. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ, హైదరాబాద్ శాస్త్రవేత్తలతో సహా విల్కిన్సన్ బృందం ఢిల్లీలోని యమునా నది, తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణా, మూసీ నదులతో సహా 104 దేశాల్లోని 258 నదులకు చెందిన 1,052 నమూనాలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో ప్రధానంగా నాలుగు రకాల మందులను గుర్తించారు. కెఫిన్, నికోటిన్, పారాసెటమాల్. గర్భనిరోధక మాత్రలు, ఇతర సింథటిక్ ఈస్ట్రోజెన్ హార్మోన్లు వంటి మందులు నీటిని అధికస్థాయిలో చేస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. పర్యావరణంలో యాంటీమైక్రోబయాల్ సమ్మేళనాలు ఉండడం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏర్పడటానికి దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒత్తిడి, అలెర్జీ, కండరాల దృఢత్వం, నొప్పి నివారణకు వినియోగించే, బలాన్ని పెంచేందుకు ఉపయోగించే డ్రగ్స్ ఆనవాళ్లను నదిలో గుర్తించారు. మూర్ఛ వ్యాధికి ఉపయోగించే కార్బమాజెపైన్ అనే డ్రగ్ బ్రిటీష్ నదుల్లో దాదాపు 70 శాతం నీటిలో ఉంది. కేవలం బ్రిటన్లోనే 54 శాంపిల్స్లో 50 మందుల ఆనవాళ్లను గుర్తించారు. అధ్యయనం ప్రకారం, 43 శాతం నది నమూనాల్లో 23 శాతం మాత్రమే సురక్షితమైన నమూనాలున్నాయి.