న్యూఢిల్లీ: విడాకులు తీసుకొన్న ఉద్యోగినులు భర్తకు బదులుగా పిల్లలను ఫ్యామిలీ పెన్షన్కు నామినేట్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం లేదా రిటైర్మెంట్ తర్వాత ఆ వ్యక్తి కుటుంబానికి పెన్షన్ మంజూరు చేయాలని సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్-2021లోని 50వ నిబంధన స్పష్టం చేస్తున్నది.
ఈ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణానంతరం తొలుత జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ను మంజూరు చేస్తారు. జీవిత భాగస్వామి మరణించాక లేక ఆ వ్యక్తి ఫ్యామిలీ పెన్షన్కు పొందే అర్హతను కోల్పోయిన తర్వాత మాత్రమే ఆ కుటుంబంలోని ఇతర సభ్యులు పెన్షన్కు అర్హులవుతారు. కానీ, ఇప్పుడు ఈ నిబంధనలను పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ విభాగం సవరించింది. విడాకులకు దరఖాస్తు చేసుకున్న లేదా గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ వేసిన ఉద్యోగిని భర్తకు బదులుగా పిల్లలను ఫ్యామిలీ పెన్షన్కు నామినేట్ చేసుకోవచ్చు.