గయ: బీహార్లో ఆందోళనకారులు రైలు నిప్పుపెట్టారు. ఆర్ఆర్బీ రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపించారు. నాన్ టెక్నికల్ క్యాటగిరీలో రిలీజైన ఫలితాలను ఆందోళనకారులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇవాళ గయలో ఓ రైలుకు నిప్పు అంటించారు. సీబీటీ2 ఎగ్జామ్ పరీక్ష తేదీను నోటిఫై చేయలేదని కొందరన్నారు. 2019లో రిలీజైన నోటిఫికేషన్కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు విద్యార్థులు ఆరోపించారు. సీబీటీ2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019 రైల్వే పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని కోరారు.
ఎన్టీపీసీ పరీక్ష ఫలితాలు రద్దు..
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎన్టీపీసీ, లెవల్ 1 పరీక్ష ఫలితాలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సెలక్షన్ విధానంలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. వేరువేరు రైల్వే బోర్డుల్లో జరిగిన పరీక్షలను ఆ కమిటీ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల సమస్యలు విన్న తర్వాత బోర్డుకు కమిటీ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.