భువనేశ్వర్: ఫీజులు చెల్లించనందుకు కొంత మంది విద్యార్థులను ఒక స్కూల్ నిర్బంధించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ స్కూల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్పై కేసు నమోదు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సంఘటన జరిగింది. భువనేశ్వర్ నగరంలోని అపీజే స్కూల్లో సోమవారం పరీక్ష తర్వాత ఫీజులు చెల్లించని 34 మంది విద్యార్థులను లైబ్రరీలో ఐదు గంటలపాటు బంధించారు. 3వ తరగతి చిన్నారుల నుంచి 9వ తరగతి విద్యార్థుల వరకు ఇందులో ఉన్నారు. అనంతరం వారికి ఫీజు నోటీసులు ఇచ్చి ఇళ్లకు పంపారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజుల అంశాన్ని తమతో చెప్పకుండా తమ పిల్లలను ఒక గదిలో పలు గంటలు బంధించడంపై మండిపడ్డారు. కొందరు పేరెంట్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో అపీజే స్కూల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), వైస్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్పై ఐపీసీతోపాటు జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఆ స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతోపాటు లైబ్రేరియన్, ఇతర టీచర్ల స్టేట్మెంట్లు రికార్డు చేస్తామని భువనేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రతీక్ సింగ్ తెలిపారు. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ను ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు ఒడిశా చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా ఈ సంఘటనను ఖండించింది. దీనిపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది.