ప్రయాగ్రాజ్: ఒక వ్యక్తిని బహిరంగంగా అవమానించడం, బెదిరించడం లేదా కించపరచడం చేస్తేనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఏడుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి, తనపైనా, తన కుటుంబసభ్యులపైనా దాడి చేసి, కులం పేరుతో దూషించారని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారిపై ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్) ప్రకారం 2017 నవంబరులో కేసు నమోదైంది.
దీనిపై నిందితుల్లో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదుదారు ఇంట్లో ఈ ఆరోపిత నేరం జరిగిందని, ఆయన ఇల్లు బహిరంగ ప్రదేశం కాదని, ప్రజలు చూసే ప్రదేశం కాదని, అందువల్ల ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. బహిరంగంగా ఈ నేరం జరగలేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఆర్) వర్తించదని ఈ నెల 10న తీర్పు చెప్పింది.