న్యూఢిల్లీ, ఆగస్టు 5: పెగాసస్ గూఢచర్యం ఆరోపణలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ ప్రారంభించింది. మీడియాలో వచ్చిన కథనాలు నిజమే అయి తే ‘ఈ వ్యవహారం చాలా తీవ్రమైనది’ అని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై పిటిషనర్లు క్రిమినల్ కేసులు పెట్టడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా.. అని ప్రశ్నించింది. పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి కూడా పంపించాలని పిటిషనర్లకు సూచించింది. విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు కేంద్రప్రభుత్వం తరఫున ప్రతినిధులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే కోర్టు కేంద్రానికి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. పెగాసస్ స్పైవేర్, గూఢచర్యంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక పిటిషన్లో ప్రధాని మోదీని కూడా పార్టీగా చేర్చారు. పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు పెగాసస్ వ్యవహారం బయటకు వచ్చింది. భారత్కు చెందిన దాదాపు 300 మంది ఫోన్లపై నిఘా ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందులో ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు తదితరులు ఉన్నారని ఆ కథనాలు వెల్లడించాయి. మరోవైపు పెగాసస్ స్పైవేర్ను ప్రభుత్వ సంస్థలకే అమ్ముతామని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో వెల్లడించిన విషయాన్ని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ‘ఇది దేశభద్రతకు సంబంధించిన విషయం. ఈ వ్యవహారంలో కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటున్నది? ఎన్ఎస్వోకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని ప్రశ్నించారు.