Karnataka | బెంగళూరు: పాకిస్థాన్ బీజేపీకే శత్రు దేశమని, తమకు మాత్రం అది పొరుగు దేశమని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరి ప్రసాద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ దేశ వ్యతిరేక భావాలకు ఆశ్రయం ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు దీనికి బీజాలు మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని శాసన సభలో లేవనెత్తారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి స్పందిస్తూ, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నాసిర్ హుస్సేన్ విజయం సాధించినట్లు ప్రకటించిన తర్వాత ఆయన మద్దతుదారులు మంగళవారం రాత్రి శాసనసభ వద్ద సంబరాలు చేసుకున్నారు. వారిలో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసినట్లు బీజేపీ, కొన్ని టీవీ చానళ్లు ఆరోపించాయి. అదేవిధంగా ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. కర్ణాటకలోని బెళగావి, చిత్రదుర్గ, మాండ్యలలో బీజేపీ బుధవారం ధర్నాలు నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.