High Court | లక్నో: అవును, నిజం! ఓ భూ వివాదంలో దెయ్యం కోర్టుకెక్కింది. ఓ కుటుంబంలోని ఐదుగురిని న్యాయస్థానానికి లాగింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో జరిగిన ఈ ఘటన అటు న్యాయ వ్యవస్థను, ఇటు పోలీసు వ్యవస్థను అయోమయానికి గురిచేసింది. ఓ భూ తగదా విషయంలో 2011లోనే చనిపోయిన శబ్ద్ప్రకాశ్ 2014లో ఓ కుటుంబంలోని ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రకాశ్ వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. అనంతరం కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న పురుషోత్తంసింగ్, ఆయన ఇద్దరు సోదరులు, ఇద్దరు కుమారులు ఈ చార్జ్షీట్ను సవాలు చేశారు. కేసు విచారణ సందర్భంగా వారి తరపు న్యాయవాది..
శబ్ద్ ప్రకాశ్ 2011లోనే చనిపోయాడంటూ డెత్ సర్టిఫికెట్ను కోర్టుకు సమర్పించాడు. తన భర్త చనిపోయిన విషయాన్ని ప్రకాశ్ భార్య మమత కూడా నిర్ధారించింది. దీంతో ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యామ్ షంష్రే చనిపోయిన వ్యక్తి ఎలా ఫిర్యాదు చేశాడని కుషీనగర్ ఎస్పీని ప్రశ్నించారు. మరణించిన వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారని, హైకోర్టులో అఫిడవిట్ను వ్యతిరేకిస్తూ సమర్పించిన పిటిషన్పైనా చనిపోయిన వ్యక్తి సంతకం చేసినట్టు తెలిసి అవాక్కయ్యారు. కేసును సమీక్షించిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. దీనిపై విచారణ చేయాలని కుషీనగర్ ఎస్పీని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తి పేరున అఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాదిని హెచ్చరించింది.