లక్నో: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం సేకరించిన నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court)లో పిల్ వేశారు. అయితే తక్షణమే ఈ కేసులో విచారణ అవసరం లేదని అలహాబాద్ హైకోర్టుకు చెందిన జస్టిస్ పంకజ్ భాటియా, అమితాబ్ కుమారి రాయ్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇప్పటికే కోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని, మిగితా కేసులను పక్కన పెట్టి, రామాలయ నిధుల కేసును విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. ఈ కేసులో అత్యవసర పరిస్థితి ఏమీలేదని కోర్టు వెల్లడించింది.
లక్నో బెంచ్ ముందు సుమారు 529 కొత్త కేసులు ఉన్నాయి. దాంట్లో అయోధ్య కేసు 393 సీరియల్ నెంబర్గా ఉంది. లక్నో బెంచ్ చాలా కేసులను డీల్ చేస్తోందని, ఇప్పుడు అయోధ్య కేసును త్వరితగతిన విచారించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొన్నది. అయోధ్య ఆలయం నిర్మాణం కోసం సేకరించిన విరాళాలను దుర్వినియోగం చేసిన కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందని అలహాబాద్ హైకోర్టు బెంచ్ పేర్కొన్నది.
రామాలయ నిధుల దుర్వినియోగంపై వ్యక్తిగత విచారణ చేపట్టాలని పిటీషనర్ మోహిత్ అశోక్ డిమాండ్ చేశారు. కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ద్వారా ఆ నిధుల అంశాన్ని ఆడిట్ చేయించాలని కోరారు.