పాట్నా: ప్రతిపక్షాల ఐక్యతకు అంతా సిద్ధమైందని బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తెలిపారు. అయితే కొన్ని పార్టీలతో తాను మాట్లాడాల్సి ఉందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు తామంతా కలిసి చర్చిస్తామని చెప్పారు. త్వరలోనే అన్ని పార్టీలు కలిసి వస్తాయని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఇటీవల కలిసిన సంగతిని గుర్తు చేశారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి కాంగ్రెస్ నేతలతో అన్ని విషయాలు చర్చించానని, ప్రతిఒక్కరూ దానికి అంగీకరించారని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తోపాటు సీపీఐతో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు. శుక్రవారం జేడీయూ కార్యకర్తలను ఉద్దేశించి నితీశ్ కుమార్ మాట్లాడారు. ‘ప్రతిపక్షాల ఐక్యతే నా ధ్యేయం. అన్ని పార్టీలు కలిసి కూర్చుని 2024 లోక్సభ ఎన్నికల కోసం ఏమి చేయాలో నిర్ణయించాలి’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ను విభేదించే ప్రతిపక్ష పార్టీల అధినేతలను కూడా నితీశ్ కుమార్ కలుస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో ఇటీవల ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ వెంటే తాను ఉన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్ష పార్టీలతోపాటు దేశమంతా కలిసి రావడం ఎంతో అవసరమన్నారు.
మరోవైపు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని కూడా నితీశ్ కుమార్ త్వరలో కలువనున్నారు. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను కలిసే బాధ్యతను ఆయన బంధువు, కుటుంబ స్నేహితుడైన ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్కు అప్పగించారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను ‘నితీశ్ ఫార్ములా’గా జేడీయూ నేతలు పేర్కొన్నారు.
Also Read: