న్యూఢిల్లీ, మార్చి 14: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర సాంస్కృతిక శాఖలో ఖాళీలపై పార్లమెంటరీ ప్యానెల్ విస్మయం వ్యక్తం చేసింది. ఈ శాఖలో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉండటం దయనీయ పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఏఎస్ఐ ఆర్కియాలజీ క్యాడర్లో 420 పోస్టులకు గానూ 166, కన్జర్వేషన్ క్యాడర్లో 918కి గానూ 452 ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నది. కొన్ని క్యాడర్లలో అయితే 50 శాతానికి పైగా పోస్టులు భర్తీకి నోచుకోలేదని, ఇది షాక్కు గురిచేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన అన్ని ఖాళీ పోస్టులను ఆరు నెలల్లో, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
నిధుల వినియోగం ఇంత నెమ్మదిగానా
2021-22 బడ్జెట్ అంచనాల్లో(బీఈ) రూ.2,687.99 కోట్లుగా ఉన్న కేటాయింపులు సవరించిన అంచనాల్లో(ఆర్ఈ) రూ.2,665కి తగ్గాయని కమిటీ తన ‘డిమాండ్ ఫర్ డ్రాఫ్ట్స్(2022-23)’ నివేదికలో వెల్లడించింది. జనవరి 31 వరకు కూడా వాస్తవ వ్యయం రూ.1842.05 కోట్లు(ఆర్ఈ కేటాయింపులో 70%)గా ఉన్నదని, ఇంత నెమ్మదిగా నిధుల వినియోగం జరగడానికి కారణాలను కమిటీ తెలుసుకోవాలని అనుకుంటున్నదని పేర్కొన్నది. 2022-23 బడ్జెట్ అంచనాల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు రూ.3,009.05 కోట్లు కేటాయించారని, శాఖ అంచనా డిమాండ్ రూ.3,357.45 కంటే 11 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించింది.
కళాకారుల పెన్షన్ను సమీక్షించండి
కళాకారులకు అందించే పెన్షన్ మొత్తంపై తక్షణం సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని, దాన్ని గౌరవప్రదంగా మార్చాలని సూచించింది. 2018-19 నుంచి ‘ఆర్టిస్ట్స్ పెన్షన్ స్కీమ్ వెల్ఫేర్ ఫండ్’ కింద లబ్ధిదారులను తగ్గిస్తూ ఉండడంపై ప్యానెల్ విచారం వ్యక్తం చేసింది.
2 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయ్..
కరోనా వచ్చినప్పట్నుంచి దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో 2.15 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. మొదటి వేవ్లో దేశానికి విదేశీ పర్యాటకుల రాక 93 శాతం తగ్గిందని, రెండో వేవ్లో 79 శాతం, మూడో వేవ్లో 64 శాతం తగ్గిందని పేర్కొన్నారు. పర్యాటక రంగంపై కరోనా మహమ్మారి ప్రభావంపై అధ్యయనం చేశామ, మొదటి వేవ్లో 1.45 కోట్ల మంది, రెండో వేవ్లో 52 లక్షల మంది, మూడో వేవ్లో 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు తేలిందని సోమవారం లోక్సభకు తెలిపారు.