కేంద్రానికి వ్యతిరేకంగా నెలపాటు ఆందోళనలు
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొగ్గు పెన్షన్దారులు సోమవారం ధర్నాకు దిగారు. ఆలిండియా కోల్ పెన్షనర్ల అసోసియేషన్, ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలరోజులపాటు కేంద్రంపై పోరుకు సిద్ధమయ్యాయి.
ఈ సందర్భంగా కోలిండియా పెన్షనర్ల అసోసియేషన్ కన్వీనర్ పీకే సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. 1998 కోల్మైన్స్ పెన్షన్ స్కీం ప్రకారం ప్రతి మూడేండ్లకోసారి పెన్షన్ పెంచాలని, కానీ ఇప్పటివరకు అటువంటి చర్యలేమీ కోలిండియా తీసుకోలేదని విమర్శించారు. ధర్నాలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్రావు, ఉపాధ్యక్షుడు ఆళవందార్ వేణుమాధవ్, వివిధ రాష్ర్టాల పెన్షన్దారులు పాల్గొన్నారు.