న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉద్భవించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా థర్డ్వేవ్ మొదలైంది. దేశంలోనూ రెండు వారాల క్రితం మొదలైన థర్డ్ వేవ్ ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. దాంతో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ వచ్చింది. శుక్రవారం నాటికి ఆ సంఖ్య 2.64 లక్షలు దాటింది. మధ్యప్రదేశ్లోనూ కొత్త కేసులు వేగం పుంజుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను జనవరి 31 వరకు పొడగించింది. 1 నుంచి 12 వరకు అన్ని తరగతులు మరో 15 రోజులు మూసేవుంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా ఈ 15 రోజుల కాలంలో ఎలాంటి రాజకీయ సమావేశాలకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే, మతపరమైన సమావేశాలుగానీ, ఫెయిర్లుగానీ నిర్వహించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే, మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ స్నానాలపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిషేధం విధించలేదు. ఎప్పటిలాగే మకర స్నానాలకు అనుమతించింది.