యూపీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కావడంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖంగు తిన్నారు. దీంతో పార్టీలో రిపేర్ను ప్రారంభించారు. ఇప్పటికే ఆమె అల్లుడు, సోదరుడికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మాయావతి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెక్టార్ ఇన్చార్జీ వ్యవస్థలను, అనుబంధ కమిటీల వ్యవస్థలను రద్దు చేస్తూ… సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం పార్టీ ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పార్టీ అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజక వర్గా ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్టీలో ప్రతి మూడు ప్రత్యేక మండలాలకు ఒక జోన్ వుంటుంది. ఆ జోన్లకు ముగ్గురు ఇన్చార్జీలు వుంటారు. ఈ కొత్త రకమైన వ్యవస్థను మున్కాద్ అలీ, రాజ్కుమార్ గౌతమ్, విజయ్ ప్రతాప్ చూసుకోవాలని మాయావతి ఆదేవించారు. ఈ ముగ్గురూ నేరుగా పార్టీ స్థితిగతులపై తనకే రిపోర్టులు సమర్పిస్తూ వుండాలని మాయావతి ఆదేశించారు.
ఎంఐఎంకు గుడ్ బై చెప్పిన గుడ్డు జమాలీ.. తిరిగి బీఎస్పీలో చేరిక
గుడ్డు జమాలీ ఎంఐఎం తరపున ఎన్నికల్లో నిలబడ్డారు. ఓడిపోయారు. దీంతో ఆయన ఎంఐఎంకు రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరుందుకు సిద్ధపడిపోయారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కర్హేల్ నుంచి అఖిలేశ్ గెలుపొందడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మాయావతి గుడ్డు జమాలీని ఆజంగఢ్ ఎంపీ ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దింపనున్నారు.