తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా పురుడు పోసుకున్న ‘నమస్తే తెలంగాణ’ నేటితో పదేండ్లు పూర్తి చేసుకొని పదకొండో వసంతంలోకి అడుగుపెడుతున్నది. నాటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజల గొంతుకై సీమాంధ్ర పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చూపింది. తెలంగాణ వ్యతిరేక శక్తులను అక్షరాయుధంతో నిలువరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచింది. జిల్లాలో రాస్తారోకోలు, వంటావార్పు, రైలురోకోలు వంటి ఘటనలను ప్రచురించి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూనే.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నది. అవినీతి అధికారుల బాగోతాలపై ‘ధర్మగంట’ మోగించి వారిని ప్రజాకోర్టులో నిలబెట్టింది. విద్యార్థులకు నిపుణ, రైతులకు ఎవుసం, మానవీయ కోణాలు, పాఠకులు మెచ్చేలా ప్రత్యేక కథనాలను అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నది.
-రంగారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ)
ఇంతింతై వటుడింతై అన్న చందంగా .. అంచెలంచెలుగా ఎదుగుతూ అన్ని వర్గాల మనన్నలను ‘నమస్తే తెలంగాణ ’ పొందింది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది. తెలంగాణ ప్రజల గొంతుకై ఎలుగెత్తి చాటింది. సీమాంధ్రుల కుట్రలు, కుతంత్రాలను ఎక్కడికక్కడ ఎండగట్టింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో సీమాంధ్ర పాలకులు తెలంగాణకు చేసిన మోసాలను బట్టబయలు చేసింది. స్వరాష్ట్రం వచ్చే వరకు అలుపెరుగని పోరాటం చేసింది. తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎండగడుతూనే ఉంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమైంది.
రంగారెడ్డి, జూన్ 5, (నమస్తే తెలంగాణ): సీమాంధ్ర ప్రభుత్వాలు, నేతల కుట్రలను తేటతెల్లం చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమానికి కుడి భుజంలా వ్యవహరించింది నమస్తే తెలంగాణ పత్రిక. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్నెత్తుకుని నడిపించింది. తెలంగాణ ఉద్యమానికి ప్రాధాన్యమివ్వకుండా, ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని కూడా ఏమి లేదన్నట్లుగా చూపించడం, తెలంగాణ ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనివ్వకుండా వ్యవహరించిన సీమాంధ్ర పత్రికలకు దీటుగా పనిచేసింది. ఈ పత్రిక పుట్టి నేటికి పదేండ్లు పూర్తి చేసుకుని పదకొండో సంవత్సరంలో అడుగుపెడుతున్నది.
సీమాంధ్ర నేతల కుట్రలు బట్టబయలు
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్ర పత్రికలు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వకుండా, ఒకట్రెండు జిల్లాల్లో మాత్రమే ఉద్యమం ఉన్నట్లుగా అసత్య వార్తలు రాస్తూ ఉద్యమ భావజాలం కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా సీమాంధ్ర నేతలు కుట్రలు, కుతంత్రాలు పన్నారు. సీమాంధ్ర నేతల కుట్రలు బట్టబయలు చేస్తూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని గురించి యావత్తు ప్రపంచానికి తెలిసేలా చేయడంలో నమస్తే తెలంగాణ సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా జిల్లాలో ఉద్యమ కథనాలతో ఉద్యమం అంతంతే అన్న కొందరి అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, ఉద్యమాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైంది. ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని ప్రజాసంఘాలు కలిసి వచ్చేలా కృషి చేసింది. తదనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ తనదైన ముద్ర వేసింది. సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర పాలకుల కుటిల రాజకీయాలను తిప్పికొడుతూ సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించడానికి వార్తలతో, ప్రత్యేక కథనాలతో ఎనలేని కృషి చేసింది. ఉద్యమంలో, రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి పాత్ర పోషించని పచ్చ పార్టీ నేతలు ఎన్నికల సమయంలో ప్రజలకు చెప్పిన అసత్య ప్రచారాలను స్పష్టంగా తెలియజేయడంలోనూ నమస్తే తెలంగాణ విజయవంతమైంది. జిల్లాలో పచ్చ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడంలోనూ ముఖ్య పాత్ర పోషించింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాలో సీమాంధ్రులు కబ్జాలు చేసిన విలువైన భూముల వివరాలను నమస్తే తెలంగాణ వెలికితీసింది. కోట్ల రూపాయల విలువచేసే వేల ఎకరాల్లో తిష్ట వేసిన సీమాంధ్రుల వ్యవహారాలను బహిర్గతం చేయడంతో కొంతమేర భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా సహాయపడింది.
పేదలకు సంక్షేమ ఫలాలు అందేలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో అధికార పార్టీ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ప్రజలు పడుతున్న కష్టాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా కథనాలు రాసి ప్రజా సంక్షేమం కోసం నిరంతరంగా పాటుపడుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, ఆసరా పింఛన్లు, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సన్న బియ్యం వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నది. సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడు పొందేలా జిల్లావ్యాప్తంగా ఆయా పథకాలపై ఎప్పటికప్పుడు విస్తృత ప్రచారం చేస్తున్నది. ఏదేమైనప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర వహిస్తున్నది.
ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు..
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నది. బంగారు తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నది. ధర్మగంట ఏర్పాటుచేసి భూసమస్యలపై పోరాడింది. అవినీతి అధికారుల బాగోతాలను బయట పెట్టి ప్రజాకోర్టులో నిలబెట్టింది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా పదేండ్లుగా తనదైన శైలిలో తెల్లవారు జామునే వార్తల సమాహారాన్ని అందిస్తూ ప్రతిఒక్కరి మనన్నలు పొందింది. విద్యార్థులకు నిపుణ, రైతులకు ఎవుసం, మానవీయ కోణాలు, ప్రత్యేక కథనాలు అందించి వినూత్నంగా దూసుకుపోతున్నది.
చెరువులపై ప్రత్యేక కథనాలు
సీమాంధ్ర ప్రభుత్వంలో చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. ఏ చెరువు ఎంత శిఖం భూమి ఉందో తెలియని పరిస్థితి. ఏ చెరువు చరిత్ర ఏంటో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితిలో నమస్తే తెలంగాణ చెరువులకు ఉన్న చరిత్రను వరుస కథనాలతో ప్రజలకు అందించింది. చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా పూడికతీత పనులు చేపట్టింది. మిషన్ కాకతీయ పథకం ప్రాధాన్యతను తెలియజేస్తూనే చెరువుల పరిరక్షణకు నడుంకట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 25 శాతం చొప్పున నాలుగేండ్లలో చెరువులను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడంతో చెరువులు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. చెరువు మట్టితో కలిగే లాభాలు, నిండితే ఊరందరికీ ఉపాధి ఉంటుందని, వీటిపై వరుస కథనాలు అందించింది.