Uttarakhand Tunnel | ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా బయటకు వచ్చారు. సహాయ బృందాలు 17 రోజుల పాటు అవిశ్రాంతంగా పని చేసి కూలీలను బయటకు తీసుకు వచ్చారు. ఉత్తర కాశీ సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో కూలీలో అందులో చిక్కుకు పోయారు. వారు చిక్కుకున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్ చేపట్టిన అధికారులు.. ఆ ప్రాంతంలోకి గొట్టం పంపి.. ఒక్కో కూలీని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్సుల ద్వారా వారిని దవాఖానలకు తరలించారు. తమ వారంతా సురక్షితంగా బయటకు రావడంతో కూలీల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కూలీలు టన్నెల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు.
కూలీలు ఈ నెల 12న సొరంగం పనులు చేస్తుండగా అది పాక్షికంగా కూలిపోయింది. దీంతో కూలీలు సొరంగంలో చిక్కుకుపోయారు. అయితే, వారు తిరిగేందుకు రెండు కి.మీ ప్రాంతం ఉండటంతోపాటు బయట నుంచి తాగునీరు, ఫుడ్, మందులు పంపే వెసులుబాటు ఉండటంతో కూలీలు క్షేమంగానే ఉన్నా.. బయటకు వచ్చే వరకూ వారి కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
సొరంగ శిధిలాల్లో 57 మీటర్ల వరకూ పైపు మార్గం వేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చునని తొలుత గుర్తించారు అధికారులు.. ఆ మేరకు 47 మీటర్ల వరకూ తవ్విన తర్వాత డ్రిల్లింగ్ యంత్రం సొరంగంలోని ఇనుప రాడ్ను ఢీకొట్టడంతో డ్రిల్లింగ్ మిషన్ పనికి రాకుండా పోయింది. కానీ అధికారులు ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిలువుగా డ్రిల్లింగ్ పనులు చేశారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న అగర్ మిషన్ శిథిలాలను కట్టర్ సాయంతో తొలగించారు. 12 మంది నిపుణులను రంగంలోకి దించి మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. సోమవారం రాత్రి నుంచి వేగంగా తవ్వడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. అటుపై కూలీలు ఉన్న ప్రాంతానికి పైపు పంపి.. వారిని ఆ పైపు ద్వారా బయటకు తెచ్చారు.