Baltimore | అమెరికా బాల్టిమోర్లో ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెనను వాణిజ్య నౌక ఢీకొట్టడంతో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఢీకొట్టిన కంటెయినర్ షిప్లోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. ఈ విషయాన్ని షిప్ మేనేజ్మెంట్కంపెనీ సినర్జీ పేర్కొంది. వంతెనను ఢీకొట్టిన కంటెయినర్ షిప్ డాలీలో సుమారు 22 మంది సిబ్బంది ఉన్నారని.. వారంతా భారతీయులేనని తెలిపింది. బాల్టిమోర్లోని ఫ్రావిన్స్ స్కాట్కీ వంతెనను కార్గో షిప్ మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఢీకొట్టడంతో కూలిపోయింది.
ఆ సమయంలో వంతెనపై సుమారు ఏడుగురు నిర్మాణ కార్మికులతో పాటు మూడునాలుగు వాహనాలు ఉండగా.. షిప్ ఢీకొట్టిన తర్వాత కార్మికులతో పాటు వాహనాలు సైతం నీటిలో పడిపోయాయి. నీటిలో పడ్డ ఒకరు క్షేమంగా ఉన్నారని.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని.. మరో ఏడుగురు నీటిలోనే ఉండిపోయినట్లగా భావిస్తున్నట్లు సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ జేమ్స్ వాలెస్ చెప్పారు. అయితే, ఎంత మంది నదిలో పడ్డారనే విషయం తెలియదన్నారు. సింగపూర్ ఫ్లాగ్ ఉన్న కంటైనర్ షిప్ గ్రేస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉందని కంపెనీ, సినర్జీ మెరైన్ గ్రూప్ తెలిపింది. ప్రమాదం జరిగిన ఓడ బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తున్నది.
ఇద్దరు పైలట్లతో సహా సిబ్బంది అందరినీ గుర్తించారు. షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ స్పందిస్తూ.. ఘటనకు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదని తెలిపారు. ప్రమాదంతో ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు. బాల్టిమోర్ కోస్ట్ గార్డ్ అధికారి మాథ్యూ వెస్ట్ మాట్లాడుతూ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) వంతెన కూలిపోయిందన్నారు. బాల్టిమోర్ అగ్నిమాపక విభాగం కూడా వంతెన కూలినట్లు ధ్రువీకరించింది. ప్రమాద తీవ్రతను గ్రహించిన మేరీల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ వంతెనపై ట్రాఫిక్ను మూసివేసింది.