కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో కూడా పోటీకి దిగుతామని మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. సంపూర్ణ మెజారిటీని సాధిస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి అవసరాల దృష్ట్యా, లోక్సభ ఎన్నికల్లో తాము, కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, తాము కొన్ని సీట్లను కాంగ్రెస్కు ఇచ్చామని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ ఫార్ములా కుదరదని తేల్చి చెప్పారు. యూపీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దామని కొందరు చెప్పుకుంటున్నారని బీజేపీని దెప్పిపొడిచారు.
రైతుల ఆత్మహత్యలు, కస్టోడియల్ మరణాలు ఇలాంటి వాటిల్లో యూపీని నెంబర్ వన్ చేశారని ఎద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, సజీవంగా ఉన్న ఆవులనే పాతిపెట్టడం లాంటి విషయాల్లో అగ్రగామిగా చేశారని మండిపడ్డారు. అసలు సజీవంగా ఉన్న ఆవులనే పాతిపెట్టడం అన్న విషయాన్ని మనం ఊహించగలమా? అని సూటిగా ప్రశ్నించారు. ఏ రంగంలో యూపీ నెంబర్ వన్ స్థానంలో ఉందో చెప్పాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉండాల్సింది కాస్తా… ఈజ్ ఆఫ్ డూయింగ్ క్రైమ్లోనే ఉందని అఖిలేశ్ తీవ్రంగా విమర్శించారు.