హైదరాబాద్ : సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు ముందు 2012 నుంచి 2017 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైతం పని చేయనున్నారు. వరుసగా మూడోసారి అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. 2017కి ముందు ఆయన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అధ్యక్షుడిగా పని చేశారు.
సమాజ్వాదీ పార్టీని 1992లో స్థాపించగా.. అఖిలేష్ యాదవ్ 2000 సంవత్సరంలో రాజకీయరంగ ప్రవేశం చేశారు. తొలిసారిగా కన్నౌజ్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009లో కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. 2012లో సమాజ్వాదీ పార్టీకి పూర్తి మెజారిటీ రావడంతో ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేశారు. అప్పటి నుంచి పార్టీలో చీలిక మొదలైంది. 2017లో, అఖిలేష్ తన తండ్రిని జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించి, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మేనమామ శివపాల్ సింగ్ యాదవ్ను సైతం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.