లక్నో: సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి పాదయాత్రగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. కాగా, బీజేపీ ఇప్పటివరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు.
కర్హాల్ నియోజకవర్గం సమాజ్వాదీ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్నది. 1993 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే ఎస్పీ ఓటమి చవిచూసింది. 2002లో జరిగిన ఎన్నికల్లో మొదటి సారి అక్కడ ఎస్పీ అభ్యర్థి ఓడిపోయారు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం మెయిన్పురీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. కర్హాల్ నియోజకవర్గం మెయిన్పురి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నది.
అఖిలేశ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారిగా పోటీచేయలేదు. ఇప్పటివరకు ఆయన ఎంపీగా, ఎమ్మెల్సీగా మాత్రమే ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.