లక్నో : తమ పార్టీ అధికారంలోకి వస్తే సమాజ్వాదీ పెన్షన్ యోజనను పునరుద్దరిస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంతర్గత సర్వే ఆధారంగా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ పార్టీ టికెట్లను పంపిణీ చేయలేదని తెలిపారు. ఆజంఘఢ్ ప్రజలు అనుమతిస్తే ఎన్నికల బరిలో దిగుతానని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరుతూ జాతీయవాదంపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయవాదంపై తాను, ఎస్పీ కాషాయ పార్టీకి సర్టిఫికెట్ ఇవ్వబోమని చెప్పారు.పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను సమాజ్వాదీ పార్టీ డిజైన్ చేస్తే తమ కలల ప్రాజెక్టు ఘనతను బీజేపీ తీసుకుంటోందని అఖిలేష్ ఆరోపించారు. బీజేపీ సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తోందని దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా కాషాయ పార్టీపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అన్నారు.
ఇక రాష్ట్రీయ జన్ సంఘర్ష్ పార్టీ ఎస్పీకి మద్దతు ప్రకటించింది. తాము ఏ స్ధానంలోనూ పోటీ చేయబోమని, ఎస్పీకి మద్దతిస్తామని తెలిపింది. ఫిబ్రవరి10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.